7, జులై 2013, ఆదివారం

నువ్వు నవ్వితే...

ప్రియమైన మిత్రులందరికి  నా బ్లాగు "నువ్వు నవ్వితే అది నా కార్టూనే... నువ్వు నవ్వకపోతే నీ మీదొట్టే..." లోకి హృదయపూర్వక స్వాగతం... సుస్వాగతం ...!! నా గురించి మీతో కొంతసేపు ...
నా పేరు శ్రీధర్ అన్నం.  కార్టూనిస్ట్ "బాచి" గా...  మీలో ఎందరికో నేను సుపరిచితుడనే... ! గత 34 సంవత్సరాలుగా "బాచి" అనే కలంపేరుతో వివిధ పత్రికలలో కార్టున్లు గీస్తున్న నేను, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు న్యాయవాదిగా  గత 27 సంవత్సరాల నుండి ప్రాక్టీసు చేస్తున్నాను.
   నా కార్టూన్లు అన్ని తెలుగు దిన, వార, పక్ష మరియు మాస పత్రికలలో ప్రచురితమైన విషయం మీకు విధితమే. అవే కాక...  ప్రముఖ తమిళ, కన్నడ, మళయాల,హిందీ,ఇంగ్లీష్ పత్రికలలో కూడా  ప్రచురింపబడ్డాయి.
అంధ్రభూమి daily లో రెండున్నర సంవత్సరాలకు పైగా ప్రచురితమైన  స్ట్రిప్  కార్టూన్లు "రాధా-రాంబాబు" నాకెంతో పేరు తెచ్చి పెట్టాయి. 
ఎన్నో ప్రదర్శనలలో చోటు చేసుకున్న నా కార్టూన్లు... 
వివిధ పత్రికలు నిర్వహించిన పలు పోటీలలో 
చాలా బహుమతులు గెలుచుకున్నాయి.  
కార్టూన్ రంగంలోనే కాదు, 
రచనా వ్యాసంగం లో కూడా 
నాదైన ప్రత్యేకతను చాటుతూ 
చిన్న కథలు, కవితలు, 
జోకులు వివిధ పత్రికలలో 
అచ్చయ్యాయి. అన్నట్లు, నా అభిమాన కార్టూనిస్ట్ ఎవరో తెలుసాండీ ...? ది  గ్రేట్ అమెరికన్ కార్టూనిస్ట్ ... "SERGIO AEROGANS ". కాని, నాకు కార్టూనింగ్ లో ఓనమాలు దిద్దించినది మాత్రం ఆంధ్ర అచ్చతెలుగు కార్టూనిస్ట్ స్వర్గీయ శ్రీ కాటూరి కృష్ణమూర్తిగారు.
నాలోని కార్టూనిస్టును  కని, పెంచింది కాటూరి గారైతే ... నాకు కార్టూన్స్ లో నడకలు నేర్పింది మా పెద్దన్నయ్యలు శ్రీ జయదేవ్ గారు, శ్రీ రామకృష్ణ గారు ! అప్పుడప్పుడు జారి క్రింద పడి పోకుండా నన్ను అణువణువూ పట్టి నడిపింది మా చిన్నన్నయ్యలు శ్రీయుతులు సుభాని, NSK ప్రసాద్, సరసి, VR ప్రసాద్, కామేశ్ గార్లు... ఈ  కార్టూన్ ప్రపంచంలో నన్ను ఉన్నత పథంలో నిలబెట్టింది ఆంధ్రజ్యోతి , ఆంధ్రభూమి తదితర పత్రికల సంపాదక వర్గాలు!!  వీరే కాక ఇంకా నన్ను ప్రోత్సహించిన ఎందరో కార్టూనిస్ట్ మిత్రులకు   ... ముఖ్యంగా  నన్ను ఆదరించిన నా పాఠక దేవుళ్ళకు నేను సదా కృతజ్ఞుడను !!
      నేను గుంటూరు జిల్లా స్టూవర్టుపురం S. A. High స్కూల్ నందు SSC పూర్తి చేసిన తరువాత చీరాల VRS & YRN  College లో 1982 సం.లో B.Com పట్టా పుచ్చుకొని, తదనంతరం, "SIR KATTAMANCHI RAMALINGAREDDY  LAW" College, Eluru   లో "లా " చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్ర    పట్టా పుచ్చుకున్నాను.
చీరాల సివిల్ కోర్టు లో 1987 నుండి 1989 వరకు ప్రాక్టీసు చేసాను. 1989 లో వ్యక్తిగత స్వాతంత్ర్యం కోల్పోయాక (అదేనండి....  పెళ్ళయ్యాక), నా ప్రాక్టీసు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి మార్చడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు High Court లోనే  ప్రాక్టీస్ కొనసాగిస్తూ... నా ఊపిరి అయిన కార్టూన్లు గీస్తూ, అందరికీ నవ్వులు పంచుతున్నాను.. న్యాయవాదిగా నేను గీసిన "కోర్టూనులు" ప్రతిరోజూ హైకోర్టు నోటీస్ బోర్డ్ యందు ప్రదర్శించబడేవి. అందుకు గానూ 2009-2010 సం.లో ఆనాటి Honorable Chief Justice Sri Madan B Lokur గారి చేతుల మీదుగా అమూల్యమైన అవార్డు  అందుకున్నాను. 
నాకు కార్టున్ రంగంతో పాటు నాటకరంగంపై కూడా మక్కువ ఎక్కువే. నటనపై నాకున్న అభిమానంతో, నటనలో నాదైన అభినివేశంతో స్టేజి మీద వివిధ నాటాకాలలో వైవిధ్యమైన పాత్రలను ధరించి ప్రేక్షకుల మన్ననలను పొందగలిగాను.అందులో హాస్య నాటికలది ప్రముఖ ప్రాధాన్యత. నాటక రంగంలో నా ఆసక్తి ఎలా ఉన్నా వేదిక మీద నన్నొక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినది మాత్రం ... బుల్లి తెర నటులు TV మిస్సమ్మ ఫేమ్ శ్రీ రాజులపాటి ప్రేమసాగర్ గారు.
ఇకపోతే,  నంది అవార్డు నాటక పోటీలలో 2009 లో నేను నటించిన " బొమ్మలు చెప్పిన భజగోవిందం" సాంఘీక నాటకానికి, రాష్ట్ర ప్రభుత్వం "బంగారు నంది"ని బహూకరించింది.
ఇది నా జీవితంలో
ఎప్పటికీ మరువలేని ఒక అరుదైన పురస్కారం.  స్త్రీ పాత్ర పోషణ లో నాదొక  ప్రత్యేకమైన గుర్తింపు ... స్త్రీ పాత్రలు పోషించడంలో శ్రీ  బుర్రా సుబ్ర హ్మణ్య శాస్త్రి గారు నాకు ఆదర్శం. పలు నాటకాలలో అనేక స్త్రీ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాను. 
అలాగే కొన్ని T.V సీరియళ్ళ లో ...  ఒకటి,  రెండు సినిమాలలో నటించడం జరిగింది. ఉన్నత న్యాయస్థానంలో లాయరు గా ఎంత బిజీ గా ఉన్నప్పటికీ...  ఇంటి వద్ద ఆఫీసులో కేసులతో, క్లయింట్స్ తో ఎంతగా సతమత మౌతున్నప్పటికి... నా కెంతో మానసిక సంతృప్తిని ఇచ్చే ఈ కార్టూన్ మరియు నాటకరంగాలలో నాదైన స్థానాన్ని నిలుపుకుంటునే ఉన్నాను. 
     ఇటు వృత్తి పరంగా నా యొక్క అభివృద్ధిలో ,  నా ప్రవృత్తి  పరంగా నా యొక్క అభిరుచులను, అభినివేశాన్ని, ప్రావీణ్యతను నేను  ప్రదర్శించుకోవడంలో... నా సతీమణి, పిల్లల సహకారం ఎంతో ఉంది. ఆ ధైర్యమేనేమో... వ్యక్తిగా...ఉప్పెనొచ్చినా బెదరని మొండితనం... గుండెల్లో సుడిగుండాలు చెలరేగినా పెదవులపై చెదరని చిరునవ్వు నాకు  పెట్టని ఆభరణాలయినాయి...  
1989 లో B.Com చదివిన శాంతిప్రియ తో వివాహం జరిగింది. మాకు ఇద్దరు సంతానం. అమ్మాయి భాగ్యమాధురి B.Tech పూర్తిచేసి ప్రస్తుతం MBA చేస్తుంది. అబ్బాయి హరిసాయి సందీప్ Civil Engineering చదువుతున్నాడు.  అడ్వకేటు గా నా కెరియర్ లో నేను అంచలంచలుగా ఎదగడానికి నా  కృషి, పట్టుదలతో   పాటు నా భార్య సహకారం నేను మరువలేనిది. 
నేను ఎంతగా ఎదిగినా ... ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా... నా చివరి శ్వాస వరకు... హస్యమనే ప్రాణవాయువును నలుగురికీ సదా అందించాలన్నదే  నా జీవిత  లక్ష్యం.
అందులో భాగంగా... Facebook లో "సిరిమల్లె పువ్వల్లె నవ్వు" అనే గ్రూపును నడిపిస్తూ మిత్రుల పూర్తి సహకారంతో అందరి మోమున చిరునవ్వుల సిరిమల్లెలు విరబూయించడానికి ప్రయత్నిస్తున్నాను.
 Dear Friends ... హాస్యం నా  ప్రాణం ... ఎన్నో ఒత్తిడులను , మరెన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి, తట్టుకోవడానికి నేను సేవించే "ఔషధం " ఏమిటో తెలుసా...? కార్టూన్స్ గీయడం ... ! వాటిని దోసిలితో మీ కందించడం... ఎందరో హాస్యబ్రహ్మలు నాటి , నీరు పోసి పెంచుతున్న ఈ  హాస్యమనే వట వృక్షాన్ని శాఖోప శాఖలుగా విస్తరింపజేయడంలొ నా వంతు కృషి గా... చంద్రునికో నూలు పోగులా... మీ అందరి కోసం ... నా ఈ చిరు ప్రయత్నమే ...
   
     "నువ్వు  నవ్వితే అది నా కార్టూనే ... నువ్వు  నవ్వకపోతే నీ మీదొట్టే..."   - ప్రేమతో ... మీ బాచి.